కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : బీసీలను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వాలవేనన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీ రక్షణ చట్టం తుది ముసాయిదా సిద్ధమైందని, త్వరలోనే ఈ చట్టాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఎనిమిది మంది బీసీ మంత్రులకు కీలక శాఖలు అప్పగించారన్నారు. కేంద్రమంత్రిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కింజరాపు రామ్మోహననాయుడికి అవకాశమిచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజక వర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, వాటిలో బీసీలకు ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు.
వడ్డెర్ల సామాజిక వర్గీయులకు అన్నివిధాలా సీఎం చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. వడ్డెరలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం రాయితీ కల్పించామన్నారు. వడ్డెరలకు మైనింగ్ లీజు రిజర్వేషన్లు రద్దు చేసిన ఘనుడు జగన్ అని విమర్శించారు. వడ్డెర్లను ఎస్టీలో చేర్చే విషయమై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. జగన్ పాలనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30 ఏళ్లు అన్ని రంగాలలో వెనుకబాటుకు గురైందని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలు ఛీ కొట్టారని, తనకు కోలుకోలేని షాక్ ఇచ్చారని, వైసీపీ పార్టీకి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని అన్నారు. అయినా జగన్ రెడ్డికి బుద్ది రావడం లేదని మండిపడ్డారు.






