కీలక ప్రకటన చేసిన సీపీ వీసీ సజ్జనార్
హైదరాబాద్ : మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసానికి చెక్ పెట్టారు సీపీ వీసీ సజ్జనార్. హైదరాబాద్ నగర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్) నిర్వహిస్తున్న భారీ బహుళ కోట్ల రూపాయల అక్రమ మనీ సర్క్యులేషన్ పథకాన్ని ఛేదించింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా 32 మందిని అరెస్టు చేసింది. ఈ మోసపూరిత నెట్వర్క్, అధిక రాబడులు ఇస్తామన్న తప్పుడు వాగ్దానాలతో ఐటీ ఉద్యోగులను, యువతను ఆకర్షించింది.
ఇలాంటి “త్వరగా ధనవంతులు అయ్యే” ఉచ్చులలో ప్రజలు చిక్కుకోవద్దని కోరారు నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. 1978 ప్రైజ్ చిట్స్ , మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ (నిషేధం) చట్టం ప్రకారం, ఈ పథకాలను ప్రోత్సహించడం లేదా వాటిలో చేరడం శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధిక ఆశలకు లోను కావద్దని కోరారు సీపీ. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా వెంటనే తమకు లేదా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు వీసీ సజ్జనార్.






