కేంద్ర సర్కార్ నిర్వాకమేనన్న వైఎస్ షర్మిలా
విజయవాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన కుట్రలో భాగమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. దళిత క్రిస్టియన్లను SC లుగా గుర్తించాలని కోరుతూ మంగళవారం విజయవాడ కేంద్రంగా CPI ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. దర్యాప్తు సంస్థలను మోడీ గుప్పిట్లో పెట్టుకున్నట్లే సుప్రీం కోర్టును కూడా పెట్టుకున్నాడా? ఈ తీర్పు ఇందుకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు.
ఆర్డర్ 1950 పేరాగ్రాఫ్ 3 రద్దు చేసేలా కాంగ్రెస్ దళిత క్రిస్టియన్ల పక్షాన నిలబడుతుందని ప్రకటించారు వైఎస్ షర్మిలా రెడ్డి. YSR ఆనాడే 2009 లో అసెంబ్లీ లో తీర్మానం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత క్రిస్టియన్లు ఉంటే , వారికి అన్యాయం జరిగితే చంద్రబాబు , జగన్ మౌనం వహించడం అన్యాయం అన్నారు. ఈ తీర్పు చూస్తే కోర్టుకి భాద్యత లేదు అనిపించింది. చాలా తొందరపడి ఇచ్చిన తీర్పు లాగా ఉందన్నారు. కేవలం ఇద్దరు న్యాయమూర్తులతో SC లకు అన్యాయం చేసేలా తీర్పు ఇచ్చారని ఆరోపించారు షర్మిలా రెడ్డి. సుప్రీం కోర్టు అంటే రాజ్యాంగానికి గార్డియన్ గా ఉండాలే తప్పా ఒక వర్గానికి మేలు చేకూర్చేలా ఉండ కూడదన్నారు.





