భారతీయ కళా రంగంలో అరుదైన రికార్డ్ నమోదు
న్యూఢిల్లీ : భారతీయ కళా రంగంలో అరుదైన ఘనత చోటు చేసుకుంది. ప్రముఖ చిత్రకారుడు, దివంగత రాజా రవివర్మ గీసిన పెయింటింగ్ ఏకంగా రూ. 167.20 కోట్లకు అమ్ముడ పోయింది. చరిత్ర సృష్టించింది.
రూ. 80-120 కోట్ల విలువగా అంచనా వేశారు. ఇదిలా ఉండగా రాజా రవి వర్మ పెయింటింగ్ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సైరస్ ఎస్ పూనావాలా అధిక ధరకు కొనుగోలు చేశారు. ముంబైలోని సాఫ్రనార్ట్ స్ప్రింగ్ లైవ్ ఆక్షన్లో రాజా రవి వర్మ గీసిన ‘యశోద , కృష్ణ’ ఆయిల్ పెయింటింగ్ ను స్వంతం చేసుకున్నారు.
ఈ వేలం పాటలో ఇప్పటి వరకు అమ్ముడైన ఆధునిక భారతీయ కళాఖండాలలో అత్యధిక విలువైనదిగా ఇది నిలిచింది. గత సంవత్సరం వేలంలో రూ. 118 కోట్లకు పైగా ధర పలికిన ఎంఎఫ్ హుస్సేన్ ‘అన్టైటిల్డ్ (గ్రామ యాత్ర)’ పేరిట ఉన్న మునుపటి రికార్డును ఈ చిత్రం అధిగమించింది. ఈ సందర్బంగా ఎస్. పూనావాలా స్పందించారు. రాజా రవి వర్మ చిత్రించిన ‘యశోద , కృష్ణ’ చిత్రాన్ని సేకరించి, పరిరక్షించి, సంరక్షించే అవకాశం లభించడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ జాతీయ సంపదను ఎప్పటికప్పుడు ప్రజల వీక్షణకు అందుబాటులో ఉంచేలా చూస్తానని, భవిష్యత్తులో దీనికి వీలు కల్పించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు.





