కేంద్ర ప్రభుత్వానికి విన్నవించిన బీసీ జనార్దన్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారుల విస్తరణకు సంబంధించి తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఉమా శంకర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా NH-42 లో ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఫోర్-లేనింగ్ పనులు , NH-716 లో మద్దనూరు నుండి కడప వరకు ఫోర్-లేనింగ్ పనులు , NH-40 లో కడప రాయచోటి విభాగంలో ఫోర్-లేన్ టన్నెల్ నిర్మాణంతో పాటు చిత్తూరు పట్టణ పరిధిలో బైపాస్ రహదారి అభివృద్ధి చేపట్టాలని కోరామన్నారు.
NH-544D లో బుగ్గ నుండి కైప వరకు రహదారి అభివృద్ధి / అప్గ్రడేషన్ పనులతో పాటు NH-167K లో నల్లకాలువ నుండి వెలుగోడు వరకు అప్గ్రడేషన్ పనులు చేపట్టాలని బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మరింత మెరుగు పడటంతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ప్రాంతీయ అభివృద్ధి దోహద పడుతుందని మంత్రి తెలిపారు. అదే విధంగా, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన అనుమతులు త్వరితగతిన మంజూరు చేయాలని కోరామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ప్రాంతీయ అధికారి హరికృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






