స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఏలూరు జిల్లాలో పర్యటించారు మంత్రి. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని , పెదవేగి సర్కిల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు వంగలపూడి అనిత. మహిళలకు మరింత సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు, ఫిర్యాదుదారులకు త్వరితగతిన సేవలు అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈ భవనాలను నిర్మించడం జరిగిందని చెప్పారు.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించామని చెప్పారు అనిత వంగలపూడి. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకుండా, ప్రజలకు చేరువగా పోలీసు సేవలను తీసుకెళ్లడమే మా ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో జగన్ రెడ్డి పాలనలో పోలీసులకు విలువ లేకుండా చేశారని ఆరోపించారు. కానీ తాము వచ్చాక పోలీస్ ఫ్రెండ్లీ సర్కార్ గా మార్చేశామని అన్నారు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






