స్పష్టం చేసిన బెజవాడ ఎంపీ కేశినేని నాని
విజయవాడ :తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వచ్చే తొలి ముఖద్వారం జగ్గయ్యపేట పట్టణం అని, దీనిని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తానని చెప్పారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఈ ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జగ్గయ్యపేటను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోందని చెప్పారు.
మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, సచివాలయ సిబ్బందితో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర అధ్యక్షతన, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) , కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురామ్ తో కలిసి పాల్గొన్నారు ఎంపీ. రాబోయే 40 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, తాగునీటి వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రకటించారు. జగ్గయ్యపేటను అమరావతి పరిధిలో తొలి పారిశ్రామిక పట్టణంగా తీర్చిదిద్దుతూ, త్వరలోనే డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని తెలిపారు.
విజయవాడ–హైదరాబాద్ ప్యాసింజర్ రైలు కోసం కృషి చేస్తున్నాం అని చెప్పారు ఎంపీ. మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఆర్థిక సాధికారతకు తోడ్పడతాం అన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, జగ్గయ్యపేటను ఆదర్శ పట్టణంగా మారుస్తాం అని చెప్పారు ఎంపీ.






