జయంతి సందర్బంగా ఘనంగా నివాళులు
అమరావతి : భారత దేశం గర్వించ దగిన యోధుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ 14న ఆయన జయంతి. ఈ సందర్బంగా ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు సీఎం.
అంటరానితనంతో కుల వివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం అని అన్నారు. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారని ప్రశంసలు కురిపించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.






