రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత
అమరావతి : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు మంత్రి సవిత. త్వరలో రాష్ట్రంలో నూతనంగా మరికొన్ని జ్యోతి బా పూలే స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందు కోసం స్పోర్ట్స్ కిట్లు అందజేయనున్నట్లు తెలిపారు. రూ.500 కోట్లతో ఎంజేపీ స్కూళ్లకు శాశ్వత భవనాలు నిర్మించనున్నామన్నారు. ఆరు ఎంజేపీ బాలికల గురుకులాలను ఇంటర్మీడియట్ కళాశాలుగా అప్ గ్రేడ్ చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. వత్సవాయి మండల కేంద్రంలో ఉన్న ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అదనపు తరగతి గదులు నిర్మిస్తున్న దాతలు చిరుమామిళ్ల రాంబాబు( ఎన్ఆర్ఐ)ను, బొగ్గవరపు వెంకటరాజారావును మంత్రి సవిత అభినందించారు. రూ.45 లక్షలు వెచ్చించి మొదటి అంతస్తులో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి, అదనపు తరగతి గదులు నిర్మిస్తున్న చిరుమామిళ్ల రాంబాబు (ఎన్ఆర్ఐ)ను ప్రత్యేకంగా అభినందించారు.
వారి స్ఫూర్తితో మరింత దాతలు ముందుకొచ్చి, ఎంజేపీ, బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు వత్సవాయి ఎంజేపీ స్కూల్ లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన మంత్రి సవిత తరగతి గదులను, విశ్రాంతి గదులను, మరుగుదొడ్లు, బాత్ రూమ్ లను పరిశీలించారు. వంట గదిలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించి రుచి చూశారు. విద్యార్థులతో మాట్లాడి, మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. బోధన ఎలా ఉంది. మౌలిక సదుపాయలు కల్పించారా..? అని అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా అమలు చేయడంతో పాటు రుచికరమైన భోజనం అందిస్తున్నందుకు సిబ్బందిని మంత్రి అభినందించారు. స్కూల్ లో ఏర్పాటు చేసిన పే ఫోన్ ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు.





