ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ కామెంట్స్
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ సాక్షిగా డీ లిమిటేషన్ బిల్లు వీగి పోవడం పై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు చేసిన నిర్వాకం బెడిసి కొట్టిందన్నారు. వారిని దేశ ప్రజలు క్షమించరని అన్నారు. టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం మోడీ నాయకత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు.
ఎంత పెద్ద నాయకుడైనా అహంకారంతో ఒంటెద్దు పోకడలకు పోతే ప్రజాస్వామ్య వ్యవస్థ అడ్డు తగులుతుందని , ఆ విషయం ఈ బిల్లుతో తేలి పోయిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇందుకు నిన్న బిల్లు వీగి పోవడమే నిదర్శనం అన్నారు. ఉత్తర భారత దేశానికి అధిక సీట్లు, దక్షిణ భారత దేశానికి తక్కువ సీట్లు ఇచ్చే ప్రక్రియను ఖర్గే, రాహుల్ నేతృత్వంలో యూపీఏ సమర్థవంతంగా ఎదుర్కొందన్నారు. బీజేపీ ప్రభుత్వ నియంత్రణ పోకడకు చెక్ పెట్టారని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలకు సంబంధించిన బిల్లులు తీసుకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా తయారు చేయాలన్నారు.





