దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖపట్నం : జీవితంలో పైకి ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని అన్నారు. కూలీ కొడుకైనా వ్యాపారస్తుడి కొడుకైనా గుర్తింపు రావాలంటే చదువు కోవాల్సిందేనని చెప్పారు. విశాఖలోని ఏయూ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, ఇతర వ్యాపకాలు కూడా ముఖ్యమని, జీవితంలో ఆనందంగా ఉండటం నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. మార్కులు, ర్యాంకులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవని, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాలని త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉద్ఘాటించారు.
అలాగే, తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకు రావద్దని ఆయన కోరారు. తనదైన శైలిలో, కాస్త హాస్యభరితంగా ఆయన ఈ ప్రసంగాన్ని కొనసాగించారు. ఎంత నడిచినా తరగని రోడ్లు, పెద్ద పెద్ద సీలింగులు, దూరంగా ఉండే క్లాస్ బోర్డులు, వినపడీ వినపడని ప్రొఫెసర్ల మాటలు అంటూ AU గురించి డైరెక్టర్ త్రివిక్రమ్ తనదైన మార్క్ స్పీచ్ తో ఆకట్టుకున్నారు. మనదే గొప్ప అనే భావన నుంచి వేరే విషయాలను యాక్సెప్ట్ చేసే స్థితికి వర్సిటీ తీసుకొస్తుందని తెలిపారు. AUలో చదివిన తాను ఫిజిక్స్ కంటే లైబ్రరీలో సాహిత్యమే ఎక్కువ చదినానన్నారు.







