నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఇరికించేందుకు, అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు ను ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందన్నారు. సంధ్య శ్రీధర్ రావు పై ఇప్పటికే ఇరవై ఆరు కేసులు ఉన్నాయని అన్నారు. అతన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని.. అతని ఆధ్వర్యంలో నవీన్ పేరు.. ఇతరుల పేర్లు చెప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఇప్పటికే నలభై ఐదు రోజులు జైలులో ఉండి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ చేత హరీష్ రావు ప్రమేయం ఉన్నట్లు చెప్పించే కుట్ర జరుగుతోందని, ఇందుకు సంబంధించి తమకు సమాచారం వచ్చినట్లు ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని, రాచరిక పాలన జరుగుతోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను , నాయకులను టార్గెట్ చేయడం, అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో భంగపాటు తప్పదన్నారు.





