గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
అమరావతి : కేంద్రం ఖుష్ కబర్ చెప్పింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అమలులోకి వస్తుందని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రజల కల నెరవేరుతోంది. జూన్ నుంచి ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ జోన్లో రాష్ట్ర పరిధిలోని మరికొన్ని సెక్షన్లు విలీనం చేయాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ను సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ను జూన్ 1 నుంచి అధికారికంగా గుర్తించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించడంతో అంతటా హర్షం వ్యక్తమవుతోంది.
2019 ఫిబ్రవరిలో ఈ జోన్ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసింది. తర్వాత అది ముందుకు సాగలేదు. చివరికి 2025 జనవరిలో డీపీఆర్కు ఆమోదం తెలిపారు. ఆదే నెలలో జోనల్ కార్యాలయ భవన నిర్మాణానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఎంతో కీలకమైన గెజిట్ నోటిఫికేషన్ రాకపోవడంతో అధికారిక కార్యకలాపాలు అమల్లోకి రాలేదు. ఈ జోన్ కార్యకలాపాలకు అవసరమైన కీలక అధికారుల నియామకం పూర్తయింది. ప్రిన్సిపల్ చీప్ మెకానికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, ప్రిన్సిపల్ చీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నియామకం పూర్తయింది. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం, జోన్ అంతటా 17వేల మంది వరకు పనిచేస్తారు. సుమారు 3వేల కిలోమీటర్లతో దాదాపు రాష్ట్రమంతా ఉండేలా కొత్త జోన్ పరిధి గుర్తించారు.





