బీసీ హాస్టళ్ల పనితీరు అద్భుతమన్న మంత్రి
అమరావతి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు మంత్రి సవిత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామన్ని, ఇది మంచి ఫలితాలు ఇచ్చేలా చేసిందన్నారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశామన్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటించారని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల మెనూకు అవసరమయ్యే నిత్యావసర సరుకుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడిందన్నారు.
దీనివల్ల నెలకు రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల వరకూ, ఏడాదికి రూ.6 కోట్లకు పైబడి ఆదా అయ్యిందన్నారు సవిత. ఎఫ్ఆర్ఎస్ విధానం మొట్ట మొదటిసారిగా బీసీ హాస్టళ్లలో అమలు చేయడం విశేషం. హాస్టల్ సిబ్బందికి కేవలం ఆదేశాలతోనే సరిపెట్టకుండా, విధి నిర్వహణలో పారదర్శకత, పర్యవేక్షణ కోసం హెచ్.పి.టి.ఎస్. యాప్ ను కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ యాప్ ద్వారా వార్దెన్లు, ఏబీసీడబ్ల్యూవోలు, డీబీసీడబ్ల్యూవోల పనితీరును మరింత మెరుగు పరచడానికి వీలు కలిగిందన్నారు. హాస్టళ్లలో మెనూ అమలు, పరిశుభ్రత, మరుగుదొడ్లు, తాగునీటి కల్పనపై ఏ రోజుకారోజు ఫొటోలను ఈ యాప్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల హాస్టళ్లలో పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం రాష్ట్ర స్థాయి అధికారులకు కలిగిందన్నారు.






