కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుస్తామన్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.హైదరాబాద్ హజ్ హౌజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హజ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు వెళుతున్న హాజీలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.
హిందూ ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటి వారని, హిందూ ముస్లింలు ఇద్దరూ అన్నదమ్ములని, కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుదామని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. మైనారిటీల నిష్పత్తి మేరకు వారికి దక్కాల్సిన సంక్షేమ పథకాలు దక్కుతాయని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని బ్లూ కాలర్ జాబ్స్ పొందడానికి వీలుగా నైపుణ్య శిక్షణ అవసరమని చెప్పారు. ప్రభుత్వం స్కిల్స్ పైన ఎక్కువగా దృష్టి సారించిందని, స్కిల్స్లో మంచి శిక్షణనిచ్చే ఏటీసీ, పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలను అంది పుచ్చుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.





