ఏపీని వెంటాడుతున్న వడగాల్పులు
అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే బుధవారం వరకు వడగాల్పుల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు. శనివారం 221 మండలాల్లో ఈ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఇక మే 24న ఆదివారం రోజు పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 – 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43- 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 – 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శుక్రవారం పశ్చిమగోదావరి(జి) తణుకులో 44.8 డిగ్రీలు, అనకాపల్లి(జి) దేవరాపల్లి, ఎన్టీఆర్ (జి) తొర్రగుడిపాడులో 44.7, ఏలూరు(జి) కలపర్రు, కృష్ణా(జి) కానుమోలు, పల్నాడు(జి) పిడుగురాళ్లలో 43.8, తూర్పుగోదావరి(జి) చిట్యాల, తిరుపతి(జి) దొరవారిసత్రంలో 43, కోనసీమ(జి) శివల, గుంటూరు(జి) తాడేపల్లి, కాకినాడ(జి) కాజులూరు, నెల్లూరు(జి) కొమ్మిపాడొలో 42.8, మన్యం(జి) సాలూరులో 42.4, విజయనగరం(జి) రామభద్రాపురంలో 42.3, విశాఖ రూరల్లో 42.1, చిత్తూరు(జి) నగరిలో 42డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.






