సీపీఐ నేతలకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్రం సహకరించక పోయినా తాము రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు నేతృత్వంలో ప్రతినిధి బృందం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా, కార్మికుల కనీస వేతనాలను పెంచాలని తీసుకున్న నిర్ణయానికి గాను వారు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో రైతుల సమస్యలపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం లేక పోయినప్పటికీ, రాష్ట్రంలో ధాన్యాన్ని సేకరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా ఉన్నప్పటికీ, కేంద్రం మొక్కజొన్నను సేకరించడం లేదని తెలిపారు. ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా సరే, రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తాము మొక్కజొన్నను సేకరిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సమావేశంలో సీపీఐ ఎమ్మెల్సీ సత్యం, నాయకులు చాడ వెంకట రెడ్డి, పాశ్య పద్మ, ఇ. నరసింహ, బాగం హేమంత్ రావు, శంకర్, బాల నరసింహ, వి.ఎస్. బోస్, అలాగే రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు





