సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా డిజైన్
హైదరాబాద్ : ఓలెక్ట్రా విద్యుత్ బస్సులు మరో 60 టీఎస్ఆర్టీసీకి చేరుకున్నాయి. దీంతో మొత్తం 500 బస్సులు ఇచ్చినట్లయింది. ఇక ఈ బస్సుల విషయానికి వస్తే దీని ప్రత్యేకతలు ఆకట్టుకుంటున్నాయి. వీటిని సులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా 12-మీటర్ల లో-ఫ్లోర్ డిజైన్ చేశారు. విశాలమైన, సౌకర్యవంతమైన సీటింగ్ ఏర్పాట్లు చేశారు. పరిశుభ్రమైన పర్యావరణానికి దోహదపడే జీరో-ఎమిషన్ టెక్నాలజీ వాడారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అధునాతన వ్యవస్థలు ఏర్పాటు చేసింది కంపెనీ .ఈ బస్సుల ద్వారా నగర ప్రయాణానికి అనువైన , సున్నితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి ఇచ్చేలా వీటిని తయారు చేశారు.
టీజీఎస్ఆర్టీసీ, ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఈ సంయుక్త చొరవ, హైదరాబాద్ గ్రీన్ మొబిలిటీ ఆశయాలలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. నగరంలో ప్రపంచ స్థాయి ప్రజా రవాణా సేవల అభివృద్ధికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పట్టణ కాలుష్యం తగ్గడం, ప్రజా రవాణా సేవలకు మెరుగైన ప్రాప్యత, పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ మొబిలిటీని స్వీకరించడం వంటి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని అంచనా. ఇది సుస్థిరమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పట్టణాభివృద్ధి పట్ల హైదరాబాద్ నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు.





