
ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
హైదరాబాద్ : అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అమలు చేయక పోవడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటుగా మార్చుకుందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. అభయహస్తం డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫారమ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) బృందం సభ్యులు. గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక డిక్లరేషన్ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఈ సంగతే పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలలో ఏ ఒక్క దాన్ని అమలుచే యడం లేదన్నారు.
ఈ సందర్భంగా వర్కర్స్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గిగ్ వర్కర్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టుగా గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, బీమాతో కూడిన సామాజిక భద్రత, సరైన వేతనాలతో పాటు మరణించిన కార్మికులకు పరిహారం చెల్లింపును వెంటనే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ హామీల అమలు బాధ్యతను తీసుకుంటానన్న రాహుల్ గాంధీ, వీరి సమస్యలపై వెంటనే స్పందించాలన్నారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్స్ అహ్మద్ బిన్ అబ్దుల్ ఖుదర్, శ్యామ్ సుందర్, లొకుర్తి నరేష్లకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 5 లక్షల ప్రమాద బీమా పరిహారం ఇప్పటికీ అందలేదన్నారు.