వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల
అమరావతి : గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకి డబ్బులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకే రూ. 88 కోట్ల అవసరం ఉంది. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్ సంస్థే రూ. 13 కోట్ల బకాయిలు కట్టాలి. పరిశ్రమలు కట్టకుండా వదిలేస్తున్న పన్ను సవ్యంగా చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల సమస్యే ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయ ఒత్తిళ్లతో మనం పన్నులు వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందన్నారు. రాష్ట్రం మొత్తం మీద పరిశ్రమలు చెల్లించాల్సిన పన్ను బకాయిలు తక్కువలో తక్కువ రూ. 115.57 కోట్లు ఉన్నాయన్నారు.
విద్యాసంస్థల నుంచి రూ. 45 కోట్లు రావాలి. ఈ రూ. 160 కోట్లలో సగం డబ్బు ఖర్చు చేస్తే రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్లు బాగు చేయవచ్చు, నిర్వహణా ఖర్చులు వస్తాయి. నిజాయితీగా ఉండే కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అన్నారు. మనం సరిగా పన్నులు వసూలు చేస్తే పంచాయతీలకు సుమారు రూ. 5,496 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు డిప్యూటీ సీఎం. ఇదంతా వసూలు చేయగలిగితే గ్రామాల్లో పారిశుధ్యపు సమస్యలు ఉండవు, సిబ్బందికి జీతాల సమస్యలు ఉండవు, వీధి లైట్ల సమస్య ఉండదు. పన్నుల చెల్లింపులపై రాష్ట్ర వ్యాప్తంగా పునః సమీక్ష చేయండి. పల్స్ సర్వే మాదిరి నాలుగు రోజుల డ్రైవ్ నిర్వహించండి. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మేము చూసుకుంటాం. పన్నులు ఎగవేస్తున్న వారి వివరాలు ప్రజలకి తెలియాలన్నారు.





