
పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఏడుతలల స్వర్ణ శేష వాహనంపై( పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామి వారిని సేవిస్తూ పాన్పుగా దాస్య భక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేశారు.
ఉత్సవాలలో భాగంగా భారీ ఎత్తున భక్తులు పోటెత్తారు పవిత్రమైన పుణ్య క్షేత్రం తిరుమల కొండకు. కొరిన కోర్కెలు తీర్చే ఆ దేవ దేవుడి కరుణ కటాక్షం కోసం బారులు తీరారు. విను వీధులన్నీ క్రిక్కిరిసి పోయాయి భక్త బాంధవులతో. గోవిందా గోవిందా , ఆపద మొక్కుల వాడా అనాధ రక్షకా, అదివో అల్లదివో శ్రీహరి వాసము, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు అంటూ భక్తుల సంకీర్తనలతో దద్దరిల్లి పోయింది. స్వామి వారిని ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్ , ఆనం రామ నారాయణ రెడ్డితో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పాల్గొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం.