సింహబల సమాన భక్తి బలానికి ప్రతీకగా వాహన సేవ
తిరుపతి : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామి వారు శ్రీ యోగ నారాయణుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించారు.
యోగ శాస్త్రంలో సింహం వాహనశక్తికి, ధైర్యానికి, శీఘ్ర గమనానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహబలం వంటి అచంచలమైన భక్తి శ్రద్ధలను కలిగి ఉన్నప్పుడే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడవుతాడని ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే స్వామి వారు రాక్షసుల హృదయాలలో సింహ స్వరూపుడిగా ప్రత్యక్షమవుతారని స్తోత్ర వాఙ్మయం కీర్తిస్తోంది.
ఈ సందర్భంగా జరిగిన వాహన సేవలో సూపరింటెండెంట్ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చెంగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించి పరవశించారు.







