తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు సంబంధించి ఏదేని సమాచారం కావాలంటే టీటీడీ టోల్ ఫ్రీ, వెబ్ సైట్ ను మాత్రమే సంప్రదించాలని కోరింది. ఇదిలా ఉండగగా వయో వృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంత కాలంగా చక్కర్లు కొడుతున్నాయని, ఇవి పూర్తిగా అవాస్తవం అని పేర్కొంది.
ప్రతిరోజు 1000 మంది వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందని తెలిపింది. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50/- ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుందని పేర్కొంది. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించడం జరుగుతోందని తెలిపింది.
సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోమారు విజ్ఞప్తి చేసింది.
భక్తులు సరైన సమాచారం కోసం టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org, https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని కోరింది. దళారులు, మధ్య వర్తుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది.






