ఆరు కిలోమీటర్ల మేర మారథాన్ లో పరుగులు
చెన్నై : టీవీకే పార్టీ చీఫ్ , తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన శుక్రవారం చెన్నైలో డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిర్వహించిన మారథాన్ ను ప్రారంభించారు . ఏకంగా యువతీ యువకులతో కలిసి ఏకంగా ఆరు కిలోమీటర్ల మేర పరుగులు పెట్టారు. ఇది ఓ రికార్డ్. తమిళనాట రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఇలాంటి ఫీట్ ను సాధించ లేదు. ఓ వైపు పాలనా పరంగా దూకుడు పెంచిన విజయ్ ఇప్పుడు ఫిట్ నెస్ పరంగా కూడా తాను సిద్దంగా ఉన్నానని చెప్పకనే చెప్పారు. కోట్లాది మందికి స్పూర్తిగా నిలిచారు. విజయ్ మారథాన్ లో పాల్గొనడం పట్ల తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఒక బాధ్యత కలిగిన ఉన్నతమైన సీఎం పోస్టులో ఉన్న వారు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ప్రజల వద్దకు చేరుతుందన్నారు. ప్రతి ఒక్కరు డ్రగ్స్ , మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సందర్బంగా సీఎం విజయ్.
ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు విజయ్ ఒక ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో పాల్గొన్నవారు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యాల వ్యసనం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవగాహన కల్పిస్తామని, మాదకద్రవ్యాల దుర్వినియోగంతో బాధపడుతున్న వారు కోలుకోవడానికి తమ వంతు సహాయం అందిస్తామని గంభీరమైన ప్రమాణం చేశారు. తమిళనాడులో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతు ఇవ్వాలని, రాష్ట్ర అభివృద్ధికి , ప్రజల సంక్షేమానికి అంకితభావంతో సేవ చేస్తామని ఈ ప్రతిజ్ఞ నొక్కి చెప్పింది.





