అడ్లూరి రవీంద్రాచారి డిమాండ్
హైదరాబాద్ : విశ్వ బ్రాహ్మణుల సమస్యలపై శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విశ్వకర్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉదయం 11 నుండి 2 గంటల వరకు నిర్వహించిన ఈ సమావేశంలో విశ్వబ్రాహ్మణ మేధావులు, ఆలోచనపరులు పాల్గొన్నారు. విశ్వకర్మీయుల ప్రధాన సమస్యలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే రౌండ్ టేబుల్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు విశ్వకర్మ ఫౌండేషన్ చైర్మన్ అడ్లూరి రవీంద్రాచారి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా… పంచదాయిల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా అయిదారు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందన్నారు.
విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన అయిదు వృత్తులు కంసాలి, వడ్రంగి, కమ్మరి, కంచర, శిల్పులను ఒక్కటిగానే గుర్తించాలని డిమాండ్ చేశామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ విశ్వబ్రాహ్మణ కులం బీసీ-బీలో 21వ నంబరుగా గుర్తింపు పొందిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ కొత్త రాష్ట్రంలో సమగ్ర కులగణనలో ఈ అయిదు వృత్తుల వారి జనాభాను వేర్వేరు కులాలుగా పరిగణించారని, దానివల్ల తక్కువ జనాభా లెక్కలతో విశ్వకర్మ సమాజానికి తీరని అన్యాయం జరుగుతుందని, రాజకీయంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు.
ఐదు వృత్తులను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఓ కమిటీ వేయాలని, అయిదు వృత్తుల నైపుణ్యాన్ని, కళలను ప్రదర్శనతో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని, నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, వృత్తి జీవనంలో ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు చేయూతను అందించాలని ఆయన అభ్యర్థించారు.







