తాడేపల్లిగూడెం : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య జయంతి జూలై 4. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయనతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని పేర్కొన్నారు. నాన్న, దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి తో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచి పోలేరు అని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కొణిజేటి రోశయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సీఎంగా విశిష్ట సేవలు అందించారు. ఆపై గవర్నర్ గా కూడా తనదైన ముద్ర కనబరిచారు. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అపారమైన విజ్ఞానం ఆయన స్వంతం. భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో ఒకడిగా గు్ర్తింపు పొందారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, అలాగే తమిళనాడు గవర్నర్గా సేవలందించారు. 4 జూలై 1933 లో వేమూరులో పుట్టారు. 88 ఏళ్ల వయసులో డిసెంబర్ 2021లో పరమ పదించారు.
1968లో శాసన మండలి సభ్యుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు . అనేక దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆర్థిక, హోం, రవాణా వంటి కీలక శాఖలను నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2009లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో మరణించిన తర్వాత, రోశయ్య 3 సెప్టెంబర్ 2009న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నవంబర్ 2010 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2011 నుండి 2016 వరకు తమిళనాడు గవర్నర్గా పనిచేశారు. కొంతకాలం పాటు కర్ణాటక గవర్నర్గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారు.















