తెలుగు వారికి తీరని ద్రోహం బాధాకరం
అమరావతి : ఎవరి ప్రయోజనాల కోసం ఉప రాష్ట్రపతి అభ్యర్థి కేఎస్ రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కూటమి పార్టీల అధిపతులపై ఉందన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన ప్రముఖ జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా బరిలో ఉన్నారని, తెలుగు వారి ఆత్మ గౌరవం ఏమైందని ప్రశ్నించారు. ఇది అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించ లేదా అని నిలదీశారు. చరిత్ర ఉన్నంత వరకు మీరు చేసిన మోసం మిగిలే ఉంటుందన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి ఇవాళ ఉప రాష్ట్రపతిగా ఎన్నికైతే దేశానికి ఒనగూరేది ఏమిటి అని మండిపడ్డారు. ఇప్పటికే భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం రెండూ ప్రమాదంలో పడ్డాయన్నారు.
ఈ తరుణంలో బాధ్యత కలిగిన, నిబద్దత కలిగిన, ప్రజల పట్ల, పౌర సమాజం పట్ల ప్రేమ కలిగిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలియ చేయక పోవడం అత్యంత బాధను కలిగించిందని వాపోయారు షర్మిలా రెడ్డి. బీజేపీ 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విధానం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఢిల్లీని మించిన రాజధాని కడతామని 11 ఏళ్లుగా దగా పడ్డామని అనిపించలేదా..? రాష్ట్ర జీవనాడి పోలవరంలో జీవం తీసేస్తే మీలో చలనం లేదా..? విశాఖ స్టీల్ ను పబ్లిక్ గా అమ్ముతుంటే మీకు రోషం ఎందుకు రావడం లేదంటూ భగ్గుమన్నారు.
దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ , జగన్ సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం చేతిలో, మోదీ చేతిలో పూర్తిగా కీలు బొమ్మలుగా మారి పోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రం గురించి అడిగే స్వరం ఢిల్లీలో ఉండేదన్న సోయి లేకపోవడం బాధాకరం అన్నారు. కూటమి పార్టీలతో తోడుగా పోటీపడి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ, ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ప్రపంచంలోనే ఇదొక వింతగా అభివర్ణించారు. ఇక రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్షం, ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి అర్హత లేదన్నారు.






