స్పష్టం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
అమరావతి : రాష్ట్రంలో యూరియా కొరత లేనే లేదని స్పష్టం చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎక్కడా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడిన దాఖలాలు లేవన్నారు. అన్నదాత పోరు పేరుతో రైతులను రెచ్చగొట్టేందుకు సరికొత్త నాటకానికి తెర తీశారని ఆరోపించారు. క్షేత్ర స్థాయిలో రైతన్నల నుంచి స్పందన లభించడం లేదన్నారు. ప్రతిపక్షం కాదు విష వృక్షం అంటూ ఎద్దేవా చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం రైతన్నల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో అమలులో భాగంగా అన్నదాత సుఖీభవను విజయవంతంగా అమలు చేసి చూపిందన్నారు.. ప్రతీ రైతుకు మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు కలిపి మొత్తం రూ.7 వేలతో 47 లక్షల మంది రైతులకు రూ.3,173 కోట్లు అందించడం జరిగిందన్నారు.
నేడు అన్నదాత పోరంటూ కపట నాటకం ఆడుతున్న జగన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 3 ఏళ్ల పాటు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు రైతు వాటా కింద నయా పైసా చెల్లించకుండా రైతుల పంట బీమాకు ఎగనామం పెట్టాడని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత, ఉల్లి ధరలు తగ్గడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్లు , వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా పంపిణీ సక్రమంగా సాగుతోందని చెప్పారు. అయితే వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంతో, రైతులు తీవ్ర ఆందోళనకు గురికావడంతో పాటు, కొన్నిసార్లు అవసరానికి మించి యూరియా కొనుగోలు చేసే పరిస్థితులు నెలకొనడంతో క్షేత్రస్థాయిలో కృత్రిమ కొరతకు కారణమవుతోందని ఆవేదన చెందారు బీసీ జనార్దన్ రెడ్డి.
అనంతపురంలో ఈ నెల 10 న జరగనున్న సూపర్ సిక్స్- సూపర్ హిట్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాయలసీమలో జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరై సక్సెస్ చేయాలని కోరారు.






