నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించారు. ఈ సందర్బంగా పోలింగ్ బూత్ లను సందర్శించేందుకు ప్రయత్నం చేశారు. ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా ఓటు వేసిన అనంతరం మాగంటి సునీత గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి చెందిన ఆకు రౌడీలంతా ఇక్కడే కనిపిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రజలంతా స్వేచ్ఛగా బయటకు రావాలని తమ విలువైన ఓటు హక్కు వినియోగించు కోవాలని కోరారు సునీత. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘనను ఉల్లంఘించారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు మాగంటి సునీత గోపీనాథ్.
పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లని కూర్చొనివ్వడం లేదని వాపోయారు. పోలీసులు వారి దగ్గర టేబుల్స్, చైర్లు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పారు.






