వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడ..?

ఏపీ సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్
అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై. మింగ మెతుకు లేదు..మీసాలకు సంపెంగ నూనెలా ఉంది ముఖ్యమంత్రి వ్యవహారం అంటూ ఫైర్ అయ్యారు. తొలి విడత సేకరించిన 54 వేల ఎకరాల్లో వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడ ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం విజయవాడలో షర్మిల మీడియాతో మాట్లాడారు. ఐకానిక్ సముదాయాల నిర్మాణాలేవి? రైతుల నుంచి తీసుకున్న 34 వేల ఎకరాల్లో 29 వేల మంది రైతులకు ఇచ్చిన హామీల సంగతేంటి ? 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక్క కిలోమీటర్ అయినా నిర్మాణం జరిగిందా అని నిలదీశారు. కళ్ళముందు సింగపూర్, జపాన్, డిల్లీ నగరాలు కనిపిస్తున్నట్లు, అమరావతి విశ్వ నగరంలో ఇక భూములు లేనట్లు అప్పుడే రెండో విడత 16 వేల ఎకరాల భూ సేకరణ మొదలు పెడతారా ? ఇది రియల్ ఎస్టేట్ మాఫియా కాకుంటే మరేంటి అని మండిపడ్డారు.
అదానీ,అంబానీ కి బాకీ పడ్డారని భూములు సేకరిస్తున్నారా ? ముంబాయి ఛత్రపతి విమానాశ్రయం 1850 ఎకరాలు.. భోగాపురం 2200 ఎకరాలు. మరి అమరావతికి 5 వేల ఎకరాలు ఎందుకు ? బీజింగ్,లండన్ లలో ఒలంపిక్స్ నిర్వహించే స్పోర్ట్స్ సిటీలు 150 ఎకరాల విస్తీర్ణమే. మరి అమరావతి స్పోర్ట్స్ సిటీకి 2500 ఎకరాలు ఎందుకు ? గడిచిన 11 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాని అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీల కోసం భూములు అంటే నమ్మశక్యమేనా అని సంచలన ఆరోపణలు చేశారు షర్మిలా రెడ్డి.
రాజధాని భూములపై వెంటనే శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మలివిడత భూ సేకరణపై అనుమానాలను నివృత్తి చేయాలి. అఖిలపక్షాన్ని వెంటనే పిలవాలి. అమరావతి విశ్వనగరం అవ్వాలనేది మా ఆకాంక్ష. తొలివిడతలో సేకరించిన భూముల్లో రాజధాని కట్టకుండా మలి విడత భూములు ఇవ్వాలని, లేకుంటే మున్సిపాలిటీ అవుతుందని రైతులను బ్లాక్ మెయిల్ చేయడం దారుణం అన్నారు. ఇది భూములు ఇచ్చిన 29 వేల మంది రైతులను మోసం చేయడమే తప్పా మరోటి కాదన్నారు.