అమ్మాన్ లో ప్ర‌ధాని మోదీకి ఘ‌న స్వాగ‌తం

VijayaBhaskar · December 15, 2025
Spread the love

సంతోషంగా ఉందంటూ పేర్కొన్న పీఎం

అమ్మాన్ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయ‌న త‌న అధికారిక ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమ్మాన్ లో కాలు మోపారు. అక్క‌డ మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ప్ర‌వాస భార‌తీయులు. వారి ప్రేమాభిమానులు వెల క‌ట్ట లేనివ‌ని పేర్కొన్నారు న‌రేంద్ర మోదీ. ప్ర‌ముఖ సామాజ‌క మాధ్యమం ఎక్స్ వేదిక‌గా త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు స్వ‌యంగా. ఇలాంటి ప్ర‌దేశాల‌ను తాను సంద‌ర్శించే స‌మ‌యంలో భారతీయులు చూపించే ప్రేమ‌, ఆద‌ర‌ణ త‌న‌కు మ‌రింత‌గా ఉత్తేజాన్ని క‌లిగించేలా చేస్తాయ‌ని తెలిపారు.

అంతే కాదు అమ్మాన్‌లో భారతీయ సమాజం అందించిన హృదయ పూర్వక స్వాగతం నన్ను ఎంతగానో కదిలించిందని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం, గర్వం , బలమైన సాంస్కృతిక బంధాలు భారతదేశం, దాని డయాస్పోరా మధ్య శాశ్వత సంబంధాన్ని ప్రతిబింబిస్తాయ‌ని స్పష్టం చేశారు. భారతదేశం-జోర్డాన్ సంబంధాలను బలోపేతం చేయడంలో డయాస్పోరా నిరంతరం పోషిస్తున్న పాత్రకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.