టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు కీలక ప్రకటన
తిరుమల : తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న రోడ్ల నిర్వహణ, మరమ్మతులు, వీధి దీపాల నిర్వహణ కొనసాగిస్తామన్నారు. శ్రీవారి పోటులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోటు సూపర్వైజర్ (పాచక) పోస్టులు ఏర్పాటుకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్ళ పేర్లను వైష్ణవ పురాణాలు, ఆళ్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలలోని శ్రీవారి నామాలు, తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు టీటీడీ చైర్మన్. ఈ కమిటీలో జాతీయ సంస్తృత విశ్వ విద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డా. చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా.డి.ప్రభాకర్ కృషమూర్తిలతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ పోస్టుల ఏర్పాటు, నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం తెలిపామన్నారు.
తిరుమలలోను, కాలిబాటలో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి, అనుభవం గల అధికారుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వీ జూనియర్ కళాశాల, ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలలో డేస్కాలర్లకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించామన్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టులోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం వసతి సముదాయం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు.
టీటీడీ అనుబంధ ఆలయాలలో పని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు బీఆర్ నాయుడు. అర్చకులకు రూ.25,000/- నుండి 45,000/-, పరిచారకులకు రూ.23,140/- నుండి 30,000/-, పోటువర్కర్లకు రూ.24,279/- నుండి 30,000/-, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు రూ.23,640/- నుండి 30,000/-కు పెంచామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వి. వీరబ్రహ్మం పాల్గొన్నారు.





