కేసీఆర్ ఆరోప‌ణ‌లు అర్థ‌ర‌హితం

VijayaBhaskar · December 22, 2025
Spread the love

ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు ఫైర్

హైదరాబాద్ : త‌మ స‌ర్కార్ పై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు. సోమవారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు.
దశాబ్ద కాలపు వైఫల్యాలను దాచి పెట్టడానికి ప్రతిపక్షం నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు.
కొత్త పెట్టుబడుల ద్వారా నైపుణ్యం, ప్రతిభ ఉన్న యువతకు 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశామ‌న్నారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాకుండా బీఆర్‌ఎస్ నాయకత్వం చురుకుగా ప్రయత్నిస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు. పెట్టుబడులను ఆకర్షించి, ఉపాధిని సృష్టించడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతిపక్ష పార్టీ అడ్డుకోవడానికి ప్రయత్నించ‌డం దారుణ‌మ‌న్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో స్థిరమైన పురోగతిని సాధిస్తోందని చెప్పారు. కొత్త పెట్టుబడుల ద్వారా నైపుణ్యం, ప్రతిభ ఉన్న యువతకు 1.40 లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. తమ 10 ఏళ్ల పాలనలోని వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి బీఆర్‌ఎస్ “తప్పుడు సమాచారాన్ని” ప్రచారం చేస్తోందని మంత్రి ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.365.75 కోట్లు విడుదల చేసింద‌ని చెప్పారు. పారదర్శక విధానాలు, ఉద్యోగ కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని శ్రీధర్ బాబు నొక్కి చెప్పారు, దీనికి విరుద్ధంగా గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని ఆయన విమ‌ర్శించారు.