నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ : విద్వేషపు కుట్రలకు మాజీ సీఎం జగన్ రెడ్డి తెర లేపాడంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న . విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేందుకు ప్లాన్ చేశాడని ధ్వజమెత్తారు. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఆనాటి భారతంలో అభిమన్యుడికి పద్మవ్యూహం లోపలికి వెళ్ళటం తెలుసు ఛేదించడం తెలియదన్నారు. ఈనాటి అభిమన్యుడు నారా లోకేష్ అని పద్మవ్యూహం చేధించడమే కాదు తిరిగి బయటికి రావటం కూడా తెలుసు అన్నారు బుద్దా వెంకన్న. అందుకే నేడు లొకేషన్ చూసి చాలామంది వైసిపి నాయకులు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాలుగు సార్లు పని చేసి ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు.
చంద్రబాబు తర్వాత ఆయన వారసుడు నారా లోకేష్ కే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని జోష్యం చెప్పారు బుద్దా వెంకన్న. చంద్రబాబు నాయుడు పడి లేచిన కెరటం అన్నారు. ఎన్నిసార్లు ఓడినా తిరిగి ప్రజాక్షేత్రంలో గెలిచాడని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా పగటి కలలు కంటూ అధికారం కోసం అడ్డదారుల్లో ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి అరాచకాలు జరుగుతున్నాయో దమ్ముంటే చర్చకు జగన్మోహన్ రెడ్డి రావాలని సవాల్ విసిరారు. గత వైసిపి ప్రభుత్వం లో అరాచకాలు జరిగాయో దారుణాలు జరిగాయో మేం చూపిస్తాం అన్నారు.






