బీసీ సంక్షేమ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్
విజయవాడ : యువ గళం పాదయాత్రతో జగన్ రాక్షస పాలనను అంతమొందించిన ఘనత మంత్రి లోకేష్ దేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత కొనియాడారు. ఆయన పేరు వింటేనే జగన్ వెన్నులో వణుకు పుడుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, భయ భ్రాంతులకు గురి చేసేవారిని ఉక్కు పాదంతో అణచి వేస్తామని హెచ్చరించారు. సకల విద్యలకు దేవత అయిన సరస్వతీ దేవి పుట్టిన రోజున మంత్రి నారా లోకేష్ జన్మదినం జరుపుకోవడం ఆనందకరమన్నారు. ఏపీ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం, ప్రజల కోసం వైసీపీ రాక్షసులతో పోరాడుతున్న మంత్రి నారా లోకేష్ కు మరింత శక్తినివ్వాలని ఆ లోకమాత దుర్గా దేవిని కోరుకున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అంతకు ముందు దుర్గమ్మ దర్శనానికి వచ్చిన మంత్రి సవితకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనా నాయక్, పాలక మండలి సభ్యులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
వేదాశ్వీరచన మండపంలో మంత్రి సవితను వేదపండితులు వేదాశ్వీరచనాలు, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసానికి వచ్చిన చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు పెన్నులను మంత్రి సవిత పంపిణీ చేశారు. వసంత పంచిత సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చారు. క్యూలైన్లో ఉన్న భక్తులను మంత్రి సవిత ఆప్యాయంగా పలుకరించారు. దేవస్థానంలో చేసిన ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. వసంత పంచమి సందర్భంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు పేరేపి ఈశ్వర్, యర్రబోతు రమణ, పలువురు డైరెక్టర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






