తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు
మంగళగిరి : టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, అసెంబ్లీకి జగన్ రావాలని పిలుపునిచ్చారు. దమ్ముంటే ప్రజా సమస్యల గురించి శాసన సభలో ప్రస్తావించాలని సూచించారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు కేవలం ఆనందోత్సవాల కోసం మాత్రమే నిర్వహిస్తున్నవి కావని, ఆయన నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉంచుకున్న అచంచలమైన నమ్మకానికి ఇవి స్పష్టమైన నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని ఆధునిక దిశలో ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం, స్పష్టమైన విజన్, అహర్నిశలు పనిచేసే తత్వం కలిగిన నాయకుడిగా లోకేష్ బాబు నిలుస్తున్నారని పేర్కొన్నారు. నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకూ ఒక “గ్రోత్ ఇంజిన్” లాంటి నాయకుడని అభివర్ణించారు.
సాధారణంగా అధికారంలో ఉన్నవారు ఇంట్లోనే ఉండి రాజకీయాలు చేయాలని చూస్తారు. కానీ లోకేష్ బాబు నిరంతరం ప్రజల్లో ఉంటూ, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో సుమారు 25% వాటా మన రాష్ట్రానికే వచ్చేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఇది ఆయన నాయకత్వ పటిమపై పారిశ్రామికవేత్తలకు ఉన్న నమ్మకమేనని అన్నారు. అభివృద్ధి అంటే ఒక్క ప్రాంతానికే పరిమితం కాకూడదని ఆయన నమ్ముతారు. అందుకే అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు. డ్రోన్ హబ్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీకి కేంద్రంగా మారుస్తున్నారు. అమరావతిని క్వాంటం వ్యాలీ, రాజధాని నిర్మాణంతో అభివృద్ధి చేస్తున్నారు. వైజాగ్ లో డేటా సెంటర్లు, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ఏర్పాటుతో ఐటీ హబ్గా తీర్చిదిద్దుతున్నారు.






