పదవికి వన్నె తీసుకు రావాలని సూచన
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు (ఆర్టీఐ) గా కొలువు తీరారు చీఫ్ కమిషనర్ వజ్జా శ్రీనివాసరావు, కమిషనర్లు వంటేరు రవిబాబు, గాజుల ఆదెన్న, పీఎస్ నాయుడు, వీఎస్కే చక్రవర్తి. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాద పూర్వకంగా ఏపీ సచివాలయంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్బంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్టీఐ కమిషనర్లను ప్రత్యేకంగా అభినందించారు నారా చంద్రబాబు నాయుడు. ఆర్టీఐ కమిషనర్లుగా మీపై గురుతరమైన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
గతంలో కొలువు తీరిన వైఎస్సార్సీపీ జగన్ రెడ్డి సర్కార్ సమాచార హక్కు కమిషన్ ను నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీఐ కమిషన్ లో పేరుకు పోయిన ఫైళ్లను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలవాలని కోరారు. ఆర్టీఐ కమిషన్ కు పూర్వ వైభవం తీసుకు రావాలని హితవు పలికారు.






