ఆఫ్గ‌నిస్తాన్ సంచ‌ల‌నం బాలికల విద్య‌పై నిషేధం

VijayaBhaskar · January 27, 2026
Spread the love

ప్ర‌క‌టించిన తాలిబాన్ల విద్యా శాఖ మంత్రి

ఆఫ్గ‌నిస్తాన్ : ఆఫ్గ‌నిస్తాన్ ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు విద్యా శాఖ మంత్రి. ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు పాఠశాలలకు వెళ్లడంపై శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. 2021లో అధికారం చేపట్టినప్పటి నుండి అంచలంచెలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన తాలిబన్లు, ఇప్పుడు సెకండరీ, ఉన్నత విద్యను పూర్తిగా అడ్డుకున్నారు. ఇప్పటికే 22 లక్షల మందికి పైగా బాలికలు చదువుకు దూరమవ్వగా, తాజా నిర్ణయంతో దేశంలో మహిళల భవిష్యత్తు అంధకారంలో పడింది. ప్రపంచంలోనే మహిళా విద్యను నిషేధించిన ఏకైక దేశంగా ఆఫ్ఘనిస్థాన్ నిలిచింది. దీంతో వారి భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

మ‌రో వైపు యావ‌త్ ప్ర‌పంచ‌మంతా ఆఫ్గ‌నిస్తాన్ స‌ర్కార్ తీసుకున్న చ‌ర్య‌ల ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉండ‌గా తాము చ‌దువుకునేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరుతూ పెద్ద ఎత్తున ఆప్గ‌నిస్తాన్ బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌లు ఆందోళన చేప‌ట్టారు. విద్య మా హ‌క్కు అని డిమాండ్ చేశారు. దుస్తుల‌పై కూడా ఆంక్ష‌లు విధించ‌డం ప‌ట్ల మండిప‌డుతున్నారు. ప్రాథ‌మిక‌, మాధ్య‌మిక పాఠ‌శాల‌లు ఈ నిర్ణ‌యంతో మూత ప‌డ‌నున్నాయి. ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్న త‌రుణంలో ఇలాంటి షాకింగ్ నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్యక్తం అవుతోంది.