కీలక వ్యాఖ్యలు చేసిన బీసీ శాఖ మంత్రి
విజయవాడ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు గౌరవ ప్రదమైన, ఆత్మగౌరవంతో కూడిన జీవనం సాగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పస్టం చేశారు. బీసీల అభ్యున్నతికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరుస్తున్నామన్నారు. త్వరలోనే బీసీల రక్షణ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. చట్టాలకి తుది మెరుగులు దిద్దుతున్నామని, దీనిలో భాగంగానే బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. బీసీలకు శాశ్వత ఆర్థిక భరోసా కలిగించేలా ఆదరణ 3.0 పథకం అమలుకు నిర్ణయించామన్నారు సవిత. ఈ పథకం కింద ఆధునిక పరికరాలు అందజేయాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. నాయీబ్రాహ్మణులు, మత్స్యకారులు, ఆర్యవైశ్యులు, గీత కార్మికులు, వడ్డెర్లకు ఇలా అన్ని బీసీ కులాలకు 19 నెలల కాలంలో ఎంతో మేలు చేశామన్నారు.
అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ భవనాలు నిర్మిస్తున్నామన్నారు మంత్రి సవిత. బీసీ బిడ్డలు చదువుకుంటున్న హాస్టళ్లు, గురుకులాలను అభివృద్ది చేస్తున్నామన్నారు. బీసీ బిడ్డలకు నాణ్యమైన ఆహారం, ఆరోగ్య భద్రతతో కూడిన విద్య అందిస్తున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా సివిల్ సర్వీసెస్ కోచింగ్, డీఎస్సీ కోచింగ్ అందజేశామన్నారు. ప్రస్తుతం రెండో విడత సివిల్స్ కోచింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. . త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో మరోసారి డిఎస్సీ కోచింగ్ అందజేయనున్నట్లు సవిత చెప్పారు. ఈ సందర్బంగా మంత్రి సవిత… ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బీసీ రక్షణ చట్టంపై కార్పొరేషన్ చైర్మన్ల సూచనలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి సహా పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.






