జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు
హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ స్థాయిలో విశిష్ట సేవలు అందిస్తున్నందుకు ఆస్పత్రికి గుర్తింపు లభించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్, సిబ్బందిని ప్రశంసించారు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సేవలు అందిస్తూ మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరారు.
ఈ ధృవీకరణతో కూడిన గుర్తింపు నాణ్యమైన ఆరోగ్య సేవలు, రోగి భద్రత, నైతిక వైద్య పద్ధతులు, మెడికో-లీగల్ అనుసరణ పట్ల ఆసుపత్రి కట్టుబాటును ప్రతిబింబిస్తుంది. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులు, వారి అర్హులైన ఆధారితులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన సురక్షిత వైద్య సేవలను అందించేందుకు ఆసుపత్రి నిరంతరం కృషి చేస్తోంది. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ , చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ మూర్తి, మెడికల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ పి. శ్రీనివాస్ , ఇతర వైద్య బృందాన్ని వైస్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
వైద్యుల సమష్టి కృషి, పట్టుదల, అత్యుత్తమైన ఆరోగ్య సేవల్ని సాధించాలనే అచంచలమైన సంకల్పానికి ఇది నిదర్శనం అని కొనియాడారు. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు, అర్హులైన వారి కుటుంబ సభ్యులకు మరింత మెరుగైన వైద్య సేవల్ని కొనసాగించాలని సూచించారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన NABH సర్టిఫికేషన్ పొందడం చాలా సంతోషంగా ఉందని, ఇది అందరి కృషితోనే సాధ్యమైందని తార్నాక ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శైలజా మూర్తి పేర్కొన్నారు.






