newsseals.com
News

దేశంలో భారీగా పెరిగిన సిజేరియ‌న్లు

VijayaBhaskar February 7, 2026
newsseals-MPGurumurthy
Spread the love

ఆందోళ‌న వ్య‌క్తం చేసిన గురుమూర్తి

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా గ‌ణ‌నీయంగా సిజేరియ‌న్లు పెర‌గ‌డం ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు ఎంపీ గురుమ‌ర్తి. పార్ల‌మెంట్ సాక్షిగా ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా సంబంధిత శాఖ మంత్రి స్పందించారు. కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు. దేశంలో శిశు మరణాల రేటు, మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గాయని తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో తల్లి, శిశు ఆరోగ్యంలో మెరుగుదల రావడం ప్రభుత్వ పథకాలు, ఆసుపత్రి ప్రసవాల పెరుగుదల ఫలితమని పేర్కొన్నారు. అయినప్పటికీ, అవసరం లేని సిజేరియన్ డెలివరీలు తల్లి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున, వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

అనవసర సిజేరియన్ డెలివరీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర‌ మంత్రి తెలిపారు. సిజిహెచ్ఎస్ పరిధిలో ఉన్న ఆసుపత్రులు సాధారణ ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాల నిష్పత్తిని ప్రజలకు స్పష్టంగా ప్రదర్శించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష్య కార్యక్రమం ద్వారా సిజేరియన్ డెలివరీలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహిస్తున్నామని, ప్రసవ సేవలపై డేటా పర్యవేక్షణను మరింత బలోపేతం చేశామని వివరించారు. గ్రామీణ , దూర ప్రాంతాల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.