ప్రజలకు మేలు చేకూర్చాలని ప్రార్థన శ్రావణి శ్రీ
అనంతపురం జిల్లా : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం, కోటంక గ్రామంలో పవిత్ర మాఘమాసం సందర్భంగా శ్రీ గుంటికింద సుభ్రమణ్య స్వామి తిరుణాల రథోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ సందర్బంగా స్వామి వారిని దర్శించుకున్నారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. కోటంక గ్రామానికి అపూర్వమైన ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చింది. శ్రీ గుంటి కింద సుబ్రహ్మణ్య స్వామి మాఘమాస తిరునాళ్లు ,రథోత్సవం సందర్భంగా ప్రజల, భక్తుల మధ్య ఉండడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు బండారు శ్రావణి శ్రీ. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భక్తి, శక్తి, ధైర్యం, ధర్మానికి ప్రతీకైన స్వామివారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా, శాంతియుతంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ప్రార్థించానని తెలిపారు.
ఇలాంటి తిరునాళ్లు, రథోత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడమే కాకుండా గ్రామంలో ఐక్యతను, సోదర భావాన్ని మరింత బలపరుస్తాయని చెప్పార. స్వామివారి మహోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దాతలు, స్వచ్ఛంద సేవకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియ జేస్తున్నానని తెలిపారు బండారు శ్రావణి శ్రీ. ప్రభుత్వ పరంగా కూడా ఆలయాల అభివృద్ధికి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మాఘమాస తిరునాళ్లు, రథోత్సవం సజావుగా, విజయవంతంగా జరగాలని, శ్రీ గుంటి కింద సుబ్రహ్మణ్యస్వామి వారి కృపా, కటాక్షాలు అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.







