ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

VijayaBhaskar · February 15, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఈసారి ప్ర‌వేశ పెట్టిన తాజా బ‌డ్జెట్ లో కూట‌మి స‌ర్కార్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని అన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో A.P.C.N.F (AP కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్) కార్యక్రమాలు అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్న 12,319 మంది ఛాంపియన్ రైతులను క్షేత్ర స్థాయి రైతు శిక్షకులుగా తయారు చేశామ‌న్నారు. వారిలో 66 శాతం మంది మహిళలు ఉండడం విశేషమ‌ని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.

ప్రకృతి వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉంచడానికి 1,712 బయో సెంటర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 2.83 లక్షల మంది రైతులు, 3.55 లక్షల ఎకరాలలో రసాయన రహిత S2S వ్యవసాయాన్ని అనుసరించారని పేర్కొన్నారు. 10.38 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు PGS సర్టిఫికేషన్లో నమోదు చేసుకున్నారని చెప్పారు. 33 వేల మంది రైతులు స్కోప్`ఆర్గానిక్ ధృవీకరణ పత్రాన్ని పొందార‌ని అన్నారు . .2026-27లో APCNF మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు-208.05 కోట్ల రూపాయలు. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్‌లో మొత్తం రూ 12,152.32 కోట్లు ప్రతిపాదించ‌డం జ‌రిగింద‌న్నారు.