ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీని టెక్నాలజీలోనే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రంగానూ అభివృద్ధి చేస్తున్నాం అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆలయాలు, పుణ్య క్షేత్రాలకు మన రాష్ట్రం ప్రసిద్ధి చెందిందని చెప్పారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట కొలువైన శ్రీశైల పుణ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం అదృష్టం అన్నారు. పంచారామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, ద్రాక్షారామం, మహానంది, శ్రీముఖ లింగం, కోటప్పకొండ వంటి ఆలయాలు ఇక్కడే కొలువుతీరి ఉన్నాయన్నారు. దేవాలయాల సంరక్షణ, నిర్వహణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రతి ఆలయంలోనూ నిత్య దీపారాధన, నైవేద్యం పెట్టాలనేది మా విధానం అని అన్నారు సీఎం. దేవాలయాల పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని పేర్కొన్నారు.
అలాగే భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లను గౌరవిస్తాం అని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఇటీవల కాలంలో ఆలయాలు, జాతరలకు భక్తుల రద్దీ పెరిగిందని అన్నారు. స్త్రీ శక్తి ద్వారా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడంతో దేవాలయాలకు వెళ్లే మహిళల సంఖ్య పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, నేను ప్రాణదానం, శ్రీవారి సేవ కార్యక్రమాలు ప్రారంభించానని చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్ర రాజధాని సహా గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల దేవాలయాలు నిర్మించాలని తలపెట్టాం అన్నారు. ముఖ్యమంత్రిగా గోదావరి, కృష్ణా పుష్కరాలను మూడోసారి నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు చంద్రబాబు నాయుడు.






