తమ గెలుపులో బంజారాలు కీలక పాత్ర పోషించారు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అభివృద్దికి నోచుకోని తాండాలను అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. తమ సర్కార్ పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బంజారాల సహకారం మరిచి పోలేమన్నారు. వారి రుణం తీర్చుకుంటామన్నారు ఎ. రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తుందని అన్నారు. నిరుపేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. చదువు లేని కారణంగా చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే నిరుపేదలు చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. నిర్దిష్టమైన ప్రణాళికలతో కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు సీఎం. దేశంలో ఎక్కడా లేని రీతిలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున నిధులను కేటాయించామన్నారు. చదువుతోనే వికాసం కలుగుతుందని, ఉన్నత స్థానాలు ఎదిగేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు ఎ. రేవంత్ రెడ్డి. అంతకు ముందు సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. బంజారాలు ప్రదర్శించిన ఉత్పత్పులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎడ్లూరి లక్ష్మణ్, కమిషనర్ విట్టా సర్వేశ్వర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.






