శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మహా విష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.
ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు.
ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వ దర్శనం కోసం బారులు తీరిన భక్తులను ఆలయ నిర్వాహకులు, పూజారులు అనుమతి ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలో జేఏఓ వి. వీరబ్రహ్మం సారథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇదిలా ఉండగా వాహన సేవలో టీటీడీ సివిఎస్వో కే.వి.మురళికృష్ణ, ఆలయ ప్రత్యేకాధికారి డి.ఫణి కుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






