టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా శిక్షణ : చంద్రబాబు
న్యూఢిల్లీ : రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతను ప్రోత్సహించేందుకు భాగస్వామ్యం వహించాలని కోరారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి తో కలిసి ఏపీ ఫస్ట్ కార్యక్రమంలో భాగస్వామి కావాలన్నారు. ఏపీలో డిజైన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కోసం ఏపీలో జీసీసీ అభివృద్ధి చేయాలని ఆటోడెస్క్ సీఈఓ మైక్ హేలీని ముఖ్యమంత్రి కోరారు. క్వాంటం టెక్నాలజికి అనుగుణంగా అమరావతిలో ఇన్నోవేషన్ అకాడెమీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లెర్నింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్ ను చంద్రబాబు నాయుడు కోరారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కలిసి నూతన ఆవిష్కరణలను తీసుకు రావటంతో పాటు విశాఖలో లెగోల్యాండ్ కల్చరల్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు సీఎం. ఏపీలో పౌరసేవలతో పాటు స్మార్ట్ గవర్నెన్సు అంశాల్లో ఏఐ సొల్యూషన్స్ అందించే అంశంపై క్వాంటెలా ఇంక్ చైర్మన్ శ్రీధర్ గధితో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ డిజిటల్ ఏఐ రీజినల్ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్ చందాతో కూడా ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. పారిశ్రామిక వేత్తలతో భేటీ అనంతరం భారత్ మండపంలో ఏర్పాటు చేసిన ఏఐ ఇంపాక్ట్ సమ్మింట్ లోని వివిధ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఎన్విడియా, నేయసా, టాటా, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ సహా వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎం ఆసక్తిగా తిలకించారు. వ్యవసాయం, వైద్యారోగ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఏఐ వినియోగం, వస్తున్న ఫలితాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. .






