బీజేపీ అంటే బాబు..జ‌గ‌న్..ప‌వ‌న్

VijayaBhaskar · March 10, 2026
Spread the love

నిప్పులు చెరిగిన ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేన‌ని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మండిప‌డ్డారు. పోలవరం ప్రాజెక్ట్ YSR కలల ప్రాజెక్ట్ అని చెప్పారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తుంటే, గ్రావిటీ ప్రాజెక్టును కాస్త ఎత్తిపోతల స్కీంలా మారుస్తుంటే, పార్లమెంట్ లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. పోలవరాన్ని ఖూనీ చేయొద్దని అడిగే దమ్ము ఒక్క ఎంపీకి లేదన్నారు.

ఇదెక్కడి అన్యాయం అని ప్ర‌శ్నించారు. బీజేపీకి వంగి వంగి ఎందుకు గులాం గురి చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మోడి రాష్ట్రానికి చేసిన మేలు కంటే కీడే ఎక్కువ‌గా ఉంద‌న్నారు. దేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉందని , కానీ ఏపీకి మాత్రం చేతిలో చిప్ప ఉందంటూ ఎద్దేవా చేశారు. రాజధానికి నిధుల బదులు అప్పులిస్తున్నారని, అప్పులెందుకని చంద్రబాబు మాత్రం అడగరంటూ ఫైర్ అయ్యారు. ప్రశ్నించాల్సిన జగన్ మోహన్ రెడ్డి నోరు మెదపరంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర బిడ్డలు ఉద్యోగాలు లేక రోడ్లమీద తిరుగుతున్నారని వాపోయారు ష‌ర్మిలా రెడ్డి. ఆటోలు తోలుకుంటున్నారు. అయినా పాలకులకు చీమ కుట్టినట్లైనా లేదున్నారు.