ఆక్వా రైతులు ఆందోళ‌న చెందొద్దు

VijayaBhaskar · March 11, 2026
Spread the love

భ‌రోసా ఇచ్చిన ఏపీ కూట‌మి స‌ర్కార్

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం గ‌ల్ఫ్ దేశాల‌లో యుద్ద వాతావ‌ర‌ణం నెల‌కొన్న త‌రుణంలో రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌న్నారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆక్వా రైతులు భయంతో లేదా ముందస్తు హార్వెస్టింగ్ చేయనవసరం లేదని అన్నారు. ఇలా చేయడం వల్ల మార్కెట్‌లో ఒకేసారి అధిక సరఫరా ఏర్పడి రొయ్యల ధరలు పడిపోవడం జ‌రుగుతుంద‌న్నారు. రైతులకు ఆర్థిక నష్టం కలగడం జరిగే అవకాశం ఉందన్నారు అచ్చెన్నాయుడు. రైతులు ఎగుమతిదారులు, మత్స్యశాఖ అధికారుల సలహాలతో తమ ప్రణాళిక ప్రకారం కల్చర్ సైకిల్ పూర్తయ్యాక మాత్రమే సరైన సమయంలో హార్వెస్టింగ్ చేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యశాఖ అంతర్జాతీయ పరిణామాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వ‌స్తోంద‌ని చెప్పారు మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు , ఇతర సంబంధిత భాగస్వాములతో సమన్వయం చేస్తూ రాష్ట్రం నుండి సముద్ర ఆహార ఎగుమతులు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రాష్ట్రంలోని రొయ్యల రైతులు నిరాధారమైన వార్తలు , వదంతులను నమ్మకుండా ప్రశాంతంగా, శాస్త్రీయ విధానంలో అక్వాకల్చర్ కార్యకలాపాలను కొనసాగించాలని అచ్చెన్నాయుడు కోరారు.