రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్రంలోని మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్ బస్సును టిప్పర్ వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1036 బస్సుల తనిఖీలు చేపట్టడం జరిగిందని వెల్లడించారు.
సరైన పత్రాలు లేని 236 బస్సులపై కేసులు నమోదు చేయడంతో పాట, జరిమానాలు కూడా విధించినట్లు పేర్కొన్నారు రాం ప్రసాద్ రెడ్డి.రాష్ట్ర వ్యాప్తంగా టోల్ప్లాజాలు, చెక్పోస్టుల్లో కలిపి 16 పాయింట్లలో తనిఖీలు చేసినట్లు తెలిపారు. ఇక నుండి విధిగా ప్రత్యేక డ్రైవ్స్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భద్రతా నియమాల ఉల్లంఘనలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యం అని పేర్కొన్నారు. అందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేక పోతే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.





